శుభోదయంa***
మిత్రులందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు
సోమవారం ప్రాంజలి ప్రభ పద్యాలు
రచన.. మల్లాప్రగడ రామకృష్ణ, Rtd. Accounts officer,
శీర్షిక -హోళి.. తేటగీతి మాల
హృదయ సంబరాలానాంద హాయి గొలుపు
కోయిలమ్మ రాగం కళ కొత్త వెలుగు
ఏడువర్ణాల జల్లులు యెల్లరాడు
ధ్వనుల కోలాహలముగాను ధరణి యందు
మధురస తరంగ చేష్టలు మానసమ్ము
అదియు హోళి సంబరమేను యల్లరవదు
మంజరి సుగంధ పరిమళం మధుర కళలు
భరత ఖండ మందున జనం భలిరె యాట
బాల బేలా కలసి వసంతాలు చల్లు
కరుణ కవ్వించు కుంటూను కదలి యాడు
ఇదియు భిన్నత్వ యేకత్వ ఇచ్ఛ యాట
సంస్కృతియు ఉత్సాహపుకేళి సౌరుభమ్ము
పడుతులు ఎగిరెగిరికేళి పడుతు యాడు
లయలు సంతోష సంబరాలకళ యదియు
పలకరింపుల కళలతో పలుకు కేళి
పూల బంతులన్నివిసిరి పూజ్యు లాట
అలక ఆత్మీయ యనురాగ ఆట యదియు
హరిహరులతొ బృందావనం హోలి కళలు
భారతీయ పర్వదినము భజన లీల
దాగియున్న మహత్వమ్ము దారి తెలుపు
***
సీస పద్యమాలిక
మధువనిలో లీల మధుమాస రంగులే
మాధవ చిరుహాస మాయ మెరిసి
పువ్వులే నవ్వులై పున్నమి కలువలు
వెల్లువెత్తెడికళ వింత మెరుపు
పుప్పొడి రంగులు పురమునజల్లిరి
గోపెమ్మ కళకళ గొప్ప లీల
బుగ్గలు ఎరుపెక్కె బుద్ధులు పరుగులై
వాడలన్ని మురిసె వరద పొంగు
పొదపొదలో రొద పోరుగా యాటలే
రత్నాల కాంతులు రంగుజల్లె
నగధారి పలుకుల నటనల కళకళ
నవ్వినదే రంగు నటన కళలు
వన్నెలొలక వేళ వర్ణము లే జల్లు
కాముని పున్నమి కళల వేళ
కొంటెవాని చిలుకు కొసరి అల్లరిలోన
జంటకలిసెకధ జాతి నందు
చిమ్మినదేను విచిత్ర రంగులకళ
వెంటబడి వనిత విలవిలవల
తడిపినదె తడిపి తకధుమ యాటలు
రాచకేళియంబర రంగుల కళ
***
కం..నరుడై సహకారముగన్
హరుడై సహనమ్ము మానవాకారముగన్
సిరులే యందించు కళల్
హరిమాయ పరమ్ముగా యధార్ధమ్ముగనెన్
***
శా..ఆదిత్యా సకలమ్ము నీ దయ సమానమ్మేను సద్భావమే
వేదమ్మే తెలిపే విధమ్ము సహనం వేదాత్మ నిర్వాహమే
నీ దాతృత్వముగాను మేము బ్రతికే నీశక్తి మమ్మేలుటే
సాదాతత్త్వముగానుసాగు విధిగా సాధ్యమ్ము సర్వమ్ముగన్
శా..రాధాకృష్ణుల కేళివేడుకమనో రక్తీ యతీతం వసం
తా ధారా ఋతువై సుహాసినివేదాంతమ్ము కోలాహలం
ప్రాధాన్యమ్ము కళేను హోలి రమణీ ప్రాబల్య ప్రేమమ్ముగా
చేదేతీపిగనే మనస్సు కదిలీ చిందేసె రంగుల్ కళే
శా..చిన్నారుల్మది చేష్టలే చిలిపిగా చింతల్లొ చిన్మాయగా
పన్నీరుల్మది నిత్య మాటలగుటే పంతమ్ము యాటల్లుగా
వెన్నాముద్దలనే తినేటి కళలే వేళల్లొ చూపేనుగా
వెన్నెల్లో విహరించు నేస్తములతో విందుల్లొ గోపాలుడే
ఉ..రంగుల హోలికేళియగు రమ్యత లోకము జూప కల్గుటే
రంగులు రాసి యాటలగు రత్నపు కాంతులు వెళ్ళు వవ్వుటే
రంగుల హావభావములు రవ్వల మెర్పులు సందడేయగన్
రంగుల యాటలై రమణి రాజ్యపు లీలలు హోలి పండుగే
ఉ..ముద్దర జీవమేయగుట ముఖ్యమనోగతి కాల మాయగన్
ప్రొద్దున మేలుచేయుటయు మ్రొ క్కెద గుర్వుకు తల్లి తండ్రికిన్
ఒద్దిక పొందగల్గెడిది నొయ్యది నేస్తము నిర్మలమ్ముగన్
పెద్దల గౌరవించు మది భిన్నము కాకయు ప్రేమ జూపుటన్
****
సోమవారం ప్రాంజలి ప్రభ కథలు
మల్లా ప్రగడ
*🌹🎨 హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All. 🎨🌹*
*ప్రసాద్ భరధ్వాజ*ప్రాంజలి ప్రభ
*. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? *
*🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀*
*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*
*🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀*
*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*
*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*
*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది. కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*
*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*
*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*
*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*
***
సేకరణ... ప్రాంజలి ప్రభ కథలు
ప్రాంజలి ప్రభ సోమవారం కధలు
మల్లాప్రగడ రామకృష్ణ
*నీకంటూ ఒకరు ఉన్నారా
నీకంటూ ఒకరు ఉన్నారా ఈ ప్రపంచంలో ఎవరైనా అంటే నీకు తెలియకుండానే ఇద్దరు ఉన్నారు ఒకరు ( తల్లి ) మరొకరు ( దైవం ) .ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి.
పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!
మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.
మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!..
90% అందరూ చేసే తప్పు ఇదే ఏవో ఏమో కావాలని పరుగులు తీస్తారు జీవితం చివరికి వారికి మిగిలింది ఉట్టిపోయిన శరీరం రోగాల కుప్పతో నిండిన శరీరం చీదరించుకున్న కుటుంబ సభ్యులు ఒక రోజు కబీర్ దాస్ ఒక ఊరిలో ఉండగా..
ఆ ఊరి ధనవంతుడు తన కొత్త ఇంటికి ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాడు.
కబీరు కూడా అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి యజమాని అందరికీ నమస్కరించి.. ‘‘నేనెంతో ధనాన్ని వెచ్చించి ఈ ఇల్లు కట్టుకున్నాను. మీరంతా నా ఇంటిని నిశితంగా పరీక్షించి ఏవైనా దోషాలుంటే నిర్భయంగా చెప్పండి. సరిచేసుకోవడానికి ఎంత డబ్బయినా వెనుకాడను’’ అంటాడు.
వచ్చిన వాళ్లల్లో కొందరు వాస్తు పండితులు కూడా ఉన్నారు. ఇంట్లోని ప్రతి భాగాన్నీ వాస్తుపరంగా చూసి ఏ దోషం లేదని చెప్పారు. కానీ,
అక్కడే ఉన్న కబీరు దాసు మాత్రం.. ‘‘ఓ యజమానీ, ఇందులో నాకు రెండు దోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీవు చెప్పమంటే చెబుతాను’’ అన్నాడు.
‘‘అయ్యా, ఆ దోషాలేమిటో నిర్మొహమాటంగా చెప్పి సరిచేసుకునే అవకాశం కల్పించండి’’ అన్నాడు యజమాని. అప్పుడు కబీరు.. ‘‘ ఒకటి.. ఈ ఇల్లు ఎంతకాలం ఇలాగే ఉంటుందో తెలుసా?’’ అని ప్రశ్నించాడు.
తెలియదని తల ఊపాడు యజమాని. ‘‘ఇక రెండోది, ఈ ఇల్లు ఉన్నంత కాలం నువ్వుంటావా?’’ అని అడిగాడు కబీరు. ఆ మాట విని యజమాని తెల్లబోయాడు. అప్పుడు కబీరు ‘‘ఈ సంపదలన్నీ అశాశ్వతాలు.
ఆత్మ, పరంగా అందరిలో ఉన్న భగవంతుడు మాత్రమే శాశ్వతం.
ఈ విషయం తెలుసుకొని మొదట నిన్ను నీవు సరిదిద్దుకో! అప్పుడే నీవు తరిస్తావు.
ఈ జన్మకున్న అర్థమేమిటో తెలుసుకుంటావు.
మానవులంతా గొర్రెల వలెనే ప్రవర్తిస్తూ.. పుట్టడం గిట్టడం కోసమే అనుకుంటారు తప్ప.. పుట్టడం గిట్టడం మధ్య ఉన్న జీవితాన్ని ఎలా గడపాలో ఆలోచించరు’’ అని చెప్పి అందరితో కలిసి భోంచేసి అక్కడి నుండి వెళ్లి పోయాడు...
........
సోమవారం ప్రాంజలి ప్రభ కధలు
సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ
వివేక వాణి ( తేచ్చుకోవలసింది బిక్ష కాని తిట్లుకాదు )
సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం . అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు .
మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు . ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది . ఒకామె సగం పాడయిపోయిన అరటిపండు వేసింది .
ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది . ఊగిపోయింది . ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు .
పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు . వారివారి పనుల్లో మునిగిపోయారు .
మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు . నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు .
పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు , శాపనార్థాలు , ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది . తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు .
వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు .
ప్రశ్న - సమాధానం
----------------
ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?
స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .
ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?
స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .
ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు , అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు .
స : నిజమే స్వామీ !
మనమూ అంతే . తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం .( మనిషి నైజం ).
***
No comments:
Post a Comment