నేడు "తెలుగు భాష దినోత్సవము" 29-08-2015 "అమ్మ ప్రేమ లాంటి తియ్యనైన, కమ్మనైన,మధురమైన తెలుగు లో మాట్లాడండి.. తెలుగువారిగా జీవించండి..!!. గిడుగు రామమూర్తి పంతులు గారు గిడుగు రామమూర్తి పంతులు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను ‘తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు. గిడుగు వెంకట రామమూర్తి (1863-1940): తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు. నేడు గిడుగు రామమూర్తి గారి జయంతి ( తెలుగిడుగు రామమూర్తిగు భాషా దినోత్సవం ) ఆంగ్లేయుల పాలన వచ్చేవరకు మనం ప్రజల భాష గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే- మనది బానిసదేశమై ఉండేది కాదు. ఇంగ్లిషువాళ్లు కొత్త బడులు పెట్టారు. కొత్త చదువులు మొదలుపెట్టారు. కొత్త పుస్తకాలు రాయించారు. అన్నిటికీమించి అందరికీ చదువు అనే ఆలోచన పెంచారు. కొత్త విద్యార్థులు ఎందరో బడిబాట పట్టారు. అప్పుడు కొత్తభాష అవసరమైంది. ఈ దశలో పద్యం జోరు తగ్గింది. వచనం హోరు మొదలైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యాడు. చిన్నయసూరి పుట్టి రెండు వందల ఏళ్లయినా, ఇప్పటికీ భాష ఆయన కనుసన్నల్లో మెలగాలని అనుకునేవాళ్లు లేకపోలేదు. ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యాడు. ఆయన పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందునుంచీ వాడుక భాషలో రాసిన వాళ్లున్నారు. ఏనుగుల వీరస్వామయ్య, సామినీన ముద్దు నరసింహం, గురజాడ అప్పారావు లాంటివారు వాడుక భాష విషయంలో గిడుగు కంటే ముందు అడుగువేసినవారిలో ప్రసిద్ధులు. గిడుగు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. 1911లో వాడుక, గ్రాంథిక భాషల మధ్య అధికార ముద్రకోసం ఎడతెగనిపోరు మొదలైంది. అంటే- ఈ సమరానికిది శతజయంతి సంవత్సరమన్నమాట. ఈ పోరులో దొంగదారిలో నెగ్గిన గ్రాంథిక శైలి ఏభై ఏళ్లపాటు (అ)యోగ్యతా పత్రాలనిచ్చే బడుల్లో చలామణి అయింది. అయినా, వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరింది. అధికారం దిగివచ్చి ఆ బావుటా కింద తలవంచి నిలిచింది. ప్రజలు ఎదిగినప్పుడు పాలకులు ఒదగక తప్పదు కదా! గిడుగు లేకపోతే ఈ గెలుపు ఇంత త్వరగా మనకు కైవసమై ఉండేది కాదు. | |||
|
29 ఆగస్టు జాతీయ క్రీడా దినోత్సవం (29 Aug National Sports Day)
“భారత్ ఆరోగ్యకరమైన జాతిగా వర్ధిల్లాలంటే వాలీబాల్ ఆడండి. క్రీడలతోనే ఇనుపకండరాలు, ఉక్కు నరాలు రూపొందుతాయి.” (దేశనిర్మాణంలో క్రీడల ఆవశ్యకతగురించి వివరిస్తూ వివేకానందుడు) ఒలంపిక్ పోటీల్లో హాకీజట్టుకు నాయకత్వం వహించి ధ్యాన్సింగ్ భారతదేశానికి మూడుసార్లు భారత్ హాకీజట్టుకు నాయకత్వం వహించి మూడుసార్లుబంగారుపతకాలను (1928,1932, 1936) సాధించాడు. బ్రిటిష్ సైన్యంలో పనిచేసినప్పుడు వెన్నెల్లో హాకీ అభ్యాసంచేయడంవల్ల తోటిసైనికులు, అధికారులు అతనిని ద్యాన్ చంద్ గా పిలిచేవారు. హాకీలో అతనికున్న ఆసక్తినిగమనించిన బ్రిటిష్ సైన్యాధికారులు అతనికి క్రీడలో శిక్షణ ఇప్పించారు. ఒలంపిక్స్ క్రీడల్లో భారతదేశం1928 నుండి 1956 వరకు హాకీలో ఆరుసార్లు బంగారుపతకాలు సాధించింది. ఈనాడు క్రికెట్ ఆటను, సచిన్ టెండుల్కర్ను మనం ఏవిధంగా అభిమానించి ఆరాధిస్తున్నామో గత70, 80 సంవత్సరాలక్రితం హాకీనీ ధ్యాన్చంద్ను అంతగా ఆరాధించేవారు.క్రీడలో అతనికున్న అసమాన ప్రతిభకు గౌరవంగా అతని జన్మదినాన్ని (29 ఆగస్టు) జాతీయ క్రీడోత్సవంగా జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగసభ హాకీని జాతీయ క్రీడగా గుర్తించి గౌరవించింది. హాకీకి సమాంతరంగా పోలిన ఆటలు భారతదేశంలో క్రీస్తుపూర్వం 1500 సం. నాడే ఉన్నట్టు పలువురు విదేశీ చరిత్రకారులు తమ పర్యటనల్లో నమోదు చేశారు. ఒలంపిక్ క్రీడలు క్రీస్తు పూర్వం 776 లో గ్రీకు దెశంలోని ఏధెంసులో మొదలయ్యాయి. దీన్నిబట్టి ఏధెంసు క్రీడోత్సవాలకు పూర్వమే హాకీ ఆట, హాకీపోటీలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. క్రీడలవల్ల శరీరానికి వ్యాయామంతోపాటు మనసుకు ప్రశాంతత కల్గుతాయి. క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. జట్టు దృక్పధం (టీం స్పిరిట్) అలవడ్తుంది. క్రీడలు చదువులోనే కాకుండా జీవితంలోనూ భాగమైనప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైన సమాజంగా మారుతుంది. భారతదేశపు క్రీడలన్నీ “ నో కాస్ట్ లేదా లో కాస్ట్” ఆటలే. కబడ్డీ, ఈత, పరుగుపందేలు, ఎడ్లబండి పోటీలు, గుర్రపుస్వారీ, తాడాట (స్కిప్పింగ్), తొక్కుడుబిళ్ళ, కర్రసాము, పోల్వాల్ట్, టగ్ఆఫ్వార్, వాలీబాల్ మొదలైనవన్నీ కానీఖర్చు లేకుండా శరీరదారుఢ్యంతోపాటు మానసిక ఏకాగ్రతను పెంచేవే. చదరంగం, గచ్చకాయలు, అష్టాచెమ్మా వంటిఆటలు ఏకాగ్రత పెరగడానికిదోహదపడ్తాయి. బౌధ్దబిక్షువులు ఆత్మరక్షణతోపాటు వ్యాయామంగా రుపొందించిన కరాటే ప్రపంచ స్థాయిలో ఆదరణపొందింది. ఈఆటలన్నింటికీ ఒకజట్టు, కొంతవిశాలమైన స్థలం కావాలి. కానీ యోగాభ్యాసానికి అత్యంత కనీసమైన 6/4 అడుగుల స్థలం పరిశుభ్రంగా ఉంటే సరిపోతుంది. ప్రపంచ ప్రజల్లో ఆరోగ్యం, క్రమశిక్షణలతో ప్రపంచ శాంతిపట్ల అవగాహన పెంచడంకోసం ఐక్యరాజ్యసమితికూడా రెండు ప్రపంచ దినోత్సవాలను నిర్వహిస్తుంది. 6 ఏప్రిల్ - క్రీడాభివృధ్ధి మరియు ప్రపంచ శాంతి దినోత్సవం మరియు 21 జూన్ - ప్రపంచ యోగా దినోత్సవం. భారతదేశం ప్రపంచానికి యోగా కరాటేలను బహుమానంగా అందించింది. ఇంతటి క్రీడా చరిత్ర కల్గిన మనం ప్రస్తుతకాలంలో నిద్రాహారాలు మానేసి క్రికెట్టువంటి క్రీడల పోటీలు చూడటంవరకే మిగిలిపోతున్నాం. వాటిని చూడటంకోసం, కేరింతలు చప్పట్లు కొట్టడంకోసమే పరిమితమౌతున్నాం. అక్కడ జరిగే గెలుపు ఓటమిలకోసం మరికొందరు ఇక్కడ భారీస్థాయిలో పందాలుకాస్తున్నారు. ఇటీవల వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో “పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్” ధీంగా అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈసదస్సులో పాల్గొన్నవారు క్రీడల ఆవశ్యకతపై నివేదించిన విషయాలు స్థూలంగా: 1) వ్యాయామం, క్రీడలు, యోగా, ప్రాణాయామంలను అభ్యసం చేసినవారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండటంవల్ల వారి విధి, వృత్తి నిర్వహణలో నాణ్యతపెరుగుతుంది. రాబోయేతరాలకు చిన్ననాటినుండే ఈ అలవాట్లు నేర్పిస్తే వైద్యారోగ్యాలపై ప్రభుత్వం చేసే ఖర్చు గణనీయంగాతగ్గుతుంది. 2) నిత్యవ్యాయామంవల్ల వ్యసనాలకు దూరంగా ఉంటారు. పొదుపు పెరుగటమే కాకుండా కొనుగోలు స్థాయిపెరుగుతుంది 3) మూడు రకాలైన వ్యాధుల్లో ఎ) జన్మతః వచ్చినవి (జెనెటిక్) బీ) కొనితెచ్చుకున్నవి (అక్వైర్డ్) సి) మన ప్రమేయం లేకుండానే సంక్రమించేవి (అఫెక్టెడ్). క్రమం తప్పకుండా వ్యాయామం చేసెవారికి అక్వైర్డ్, అఫెక్టెడ్ వ్యాధులు దరిచేరవు. జెనెటిక్ వ్యాధులుపూర్తి అదుపులో ఉంటాయి. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలనే ప్రమేయం లేకుండా నాల్గింట మూడొతుల పాఠశాలలకు క్రీడా స్థలాలు లేవు. క్రీడా స్థలాలు ఉన్నవాటిలో మూడొతుల పాఠశాలల్లో ఆడించరు. తల్లిదండ్రులకు, పిల్లలకు ఆటలపై ఆసక్తిఉన్నప్పటికీ ఆడించడానికి పలుచోట్ల వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. వ్యాపారమే పరమావధిగానున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ర్యాంకులు, పర్సంటేజీలే లక్ష్యంగా తమతోపాటు ప్రభుత్వ పాఠశాలలనుకూడా పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ పోటీలో పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అధికారులు అందరూ మూకుమ్మడిగా మానసిక, వ్యక్తిత్వాల వికాసానికి అత్యవసరమైన వ్యాయామాన్ని, ఆటలను పణంగా పెడ్తున్నారు. ఈపరిస్థితులకు ఇతరులనూ, పరిస్థితులనూ నిందించేబదులు చిన్నతనంనుండి గుణగణాలు, మంచిచెడు నేర్పించినట్లుగానే తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చిన్న వయసునుండే ఆటలు, యోగా, ప్రాణాయామం కనీసం వాకింగ్ నేర్పించడం తమ బాధ్యతల్లో భాగంగా నిర్వర్తించాలి. వ్యాయామం, క్రీడలు, యోగా, ప్రాణాయామం లు జీవనవిధానంలో మిళితంచేయడం, యోగాను రూపొందించిన పతంజలి, ధ్యాన్చంద్లకు నివాళి మాత్రమేకాదు, మనకుటుంబ శ్రేయస్సుకు మార్గంకూడా. | |||
|
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ (AUG 26 1910)
wish you happy birthday our mother
ఓ మై మదర్!
దేవుడు అంతటా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. మరి, ఆ అమ్మకూడా లేని
వారి పరిస్థితి? ఈ అనుమానం వచ్చిందేమో మదర్ థెరిస్సాను పుట్టించాడా
దేవుడు. అమ్మ లేని అభాగ్యులు ఇండియాలో ఎక్కువుంటారని భావించాడేమో.. ఆమె
ఎక్కడో పుట్టినా ఇండియా పంపించాడు. మదర్ థెరిసా.. భారతదేశపు మహామాత. బిగ్
హార్ట్ ఆఫ్ ఇండియా. దిక్కులేని వారికి మదర్ థెరిసాయే దిక్కు అనే స్థాయికి
ఎదిగిన అరుదైన వ్యక్తిత్వం. మదర్ థెరిసా.. శాంతికి స్వచ్ఛమైన స్వరూపం..
అచ్చమైన చిరునామాగా మారిన వైనం.
మదర్ థెరిసాకు ఇంత పెద్ద మనసు ఎక్కడిదసలు? తాను కడుపు తెంచుకుని
కనకున్నా.. ఇంతలా ప్రతి బిడ్డనూ కన్నతల్లిలా ఎలా ప్రేమించగలిగింది? మదర్
కంటబడితే అనాధలు అదృష్టవంతులౌతారు ఎందుకని? తానెక్కడో పుట్టి ఇండియాలో ఇంత
మందికి మాతృమూర్తిగా ఎలా మారింది? నడిచే మానవత్వంగా పేరుపొందడానికి
ఆమెకంతటి ప్రేరణ ఎక్కడ్నుంచి వచ్చింది? ఇవి ప్రశ్నలు కాదు ఆ మహాతల్లికి
చెందిన ప్రశంశలు. ఎవరికీ అందని అరుదైన ఘనత సొంతమైన మదర్ జీవన చిత్రంలోకి ఒక
పయనం..
మదర్ థెరీసాలో మానవత్వం ఇంతలా పెల్లుబకడానికి కారణం తెలియాలంటే
1946నాటి కాలానికి వెళ్లాలి. అవి థెరిసా కలకత్తాలోని.. లొరెటో కాన్వెంట్
స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న రోజులు. సరిగ్గా అదే సమయంలో బడి అవతల
హిందూ ముస్లీం గొడవలు ఉదృతంగా సాగుతున్నాయి. ఇవేవీ పట్టని థెరీసా.. తన
పిల్లలకు పాఠాలు చెబుతోంది. పిల్లలు అడిగే కఠిన ప్రశ్నలకు సమాధానంగా తనకు
అంతటి రాజకీయ పరిజ్ఞానం లేదని సున్నితంగా తెలిపేది. పాపం ఆ బాలికల తప్పేం
లేదు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాలే వారి ప్రశ్నావస్తువులయ్యాయి.
బయట గొడవల వల్ల పిల్లలకు ఆహారం అందించలేని దుస్థితి. 200మంది పిల్లలు..
వారి ఆకలి తీర్చాలంటే బయట ఎంత గొడవైనా వెళ్లక తప్పదు. థెరిసా సాహసం
చేసింది. అడుగడుగునా అల్లర్లే. పోలీసులూ, అల్లరిమూకలు చేస్తున్న గందరగోళం.
గోడౌన్ దగ్గరకెళ్లి తలుపు తట్టిందామె. ప్రయోజనం లేదు. ఇంతలో ఇంగ్లీషు
పోలీసులొచ్చారు. సమస్య వివరించింది థెరిసా. బియ్యం బస్తాలను జీపులో వేయించి
పదండి.. అన్నారా తెల్ల పోలీసులు. ఆమె అలా ధాన్యం తీసుకుని జీపులో
వస్తుండగా ఎన్నో రోజులుగా పస్తులున్న వారు అడ్డుకున్నారు. ఆకలికేకలు
పెట్టారు. థెరిసాలో మాతృత్వానికి బీజం పడిన తొలి క్షణాలవి. ఎలాగోలా ఆ
గొడవనుంచి తప్పుకుని స్కూలు చేరింది థెరిసా ఎక్కిన జీపు. పిల్లలకు ఆహారం
దొరికిందిన్న సంతోషంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అల్లర్లు ప్రశాంతంగా
వుండనివ్వ లేదు. అనుకోకుండా ఒక తుపాకీ గుండు తగిలిన బాధితుడు
స్కూల్లోకొచ్చి పడ్డాడు. అలజడి చెలరేగింది. అతడికి వైద్యసాయం అందించడానికి
రంగంలోకి దిగింది సిస్టర్ థెరిసా. ఆమెను ఆలోచనల్లో పడేసిన సందర్భమూ అదే.
థెరిసా అంత తెగువ చూపినందుకు ఫాదర్ మందలించారు. మన తొలి ప్రాధాన్యత
స్కూలు నడపడం. తిండీ గిండీ తరువాత. అలా గొడవల మధ్యకెళ్లి ఆహారం సేకరించడంలో
పొరబాటు జరిగితే హయ్యర్ అథారిటీస్ తో ఏం చెప్పాలి? అంటూ ప్రశ్నించాడు.
రూల్స్ రెగ్యులేషన్లనే అడ్డుగోడల మధ్య మానవత్వం మరచి తాను ఉండలేనని
చెప్పింది థెరిసా. ఆ సంఘర్షణా సమయంలో డార్జీలింగ్ బయలు దేరింది. అక్కడ ఒక
బిచ్చగాడు దీనంగా చేతులు చాపి అడుక్కుతింటుండటం గమనించింది థెరిసా. అతడి
కళ్లలోని దైన్యం ఆమెను కట్టిపడేసింది. పదిపైసలేసి చూసింది. అయినా ప్రయోజనం
లేక పోయింది. అతడి దీనస్థితిని కలకత్తా నుంచి అలాగే డార్జిలింగ్
పట్టుకెళ్లింది థెరిసా.కళ్లుండీ లేని వాళ్లలా తాను బతకలేదు. గుండెను ఉట్టి
ఊపిరి పీల్చుకోడానికి మాత్రమే ఉపయోగించే వ్యక్తిత్వం కాదు తనది. మరో
ప్రపంచంలో లేం మనం. అందరూ సమానంగా బతకాల్సిన ప్రపంచంలో ఇన్నేసి అంతర్యాలా?
అన్నమో రామచంద్రా అంటూ ఎందరో పేదలు అల్లాడుతుంటే తనకేమో రుచికరమైన ఆహారం..
ఫస్ట్ క్లాస్ ప్రయాణం. అనుక్షణం సంఘర్షణ. తనకు తాను ఒక నిర్ణయానికి రాలేక
పోతోంది. అంతలో ఏదో స్టేషన్లో ట్రైన్ ఆగితే వెళ్లి థార్డ్ క్లాస్ బోగీ
ఎక్కి అక్కడి ప్రజలతో సమానంగా ప్రయాణించడానికి సిద్ధపడింది. థెరిసా..
మానవత్వానికి మరో కోణం. దీనత్వాన్ని కాపాడ్డానికి భూమ్మీదకొచ్చిన ఒకానొక
దైవత్వం. కొన్ని ఉత్తుంగతరంగాలు ఇలాగే ఉంటాయి కాబోలు. సిస్టర్ థెరిసా
గురించి ఆందోళన ఎక్కువైంది. మాటకొస్తే ఫాదర్ దగ్గరకు ఆమె మీద కంప్లైంట్స్.
ఆమెను నియంత్రించడానికి ఫాదర్ పాట్లు పడాల్సి వస్తోంది. ఒక్కసారి
మాతృత్వానికి లోనైతే అంతే. పేగు తెంచుకుని పుట్టకున్నా.. ఆ ప్రేమ అలా
పొంగిపొర్లుతుంది. ఎన్ని అవాంతరాలు దాటైనా ప్రేమ పంచాలనుకుంటుంది. తనను
పేదలెక్కడుంటారో అక్కడికి పంపి సేవచెయ్యమని దేవుడు చెబుతున్నాడని చెప్పేది
థెరిసా. ఆర్చ్ బిషప్ ను కలసి ఆమె గురించి వివరించాల్సి వచ్చేది ఫాదర్ కి.
బుద్ధుడు మరోసారి పుడితే.. అది కూడా ప్రజలందరినీ కన్నబిడ్డలుగా
చూసుకోవాలని మహిళ జన్మఎత్తితే. ఈ పోలికకు అచ్చుగుద్దినట్టు అనిపిస్తుంది
థెరిసాను చూస్తే. ఎక్కడ మనుషులు దారుణంగా బతుకుతారో అక్కడ తను
చలించిపోయేది. కలకత్తా వీధుల్లో నడుస్తుండగా అదే జరిగింది. ఒక వృద్ధురాలు
రోడ్డున దీనావస్థలో వుంటే గుర్తించి ఈవిడను వెంటనే ఆసుపత్రికి చేర్చాలని
కలత చెందింది. అంతే కాదు.. ఆ మహిళతో ఆసుపత్రి చేరింది. అక్కడా అదే
నిర్లక్ష్యం. హోప్ లెస్ కేస్ తో తాము వేగలేమని తెగేసి చెప్పింది నర్స్.
ఆమెను మోసుకొచ్చిన బండి వాడు కూడా దయ చూపడం లేదు. ఒక పక్క వర్షం. తనతో
వచ్చిన పిల్లల్ను స్కూలుకెళ్లమని చెప్పి ఆ వృద్ధురాలిని కన్నబిడ్డతో
సమానంగా మోస్తూ అక్కడే నిలుచుంది. అవి గుండెలే అయితే కరిగి కన్నీరు
పెట్టాల్సిన పరిస్థితి. డాక్టర్లలో కదలికలొచ్చాయి. ఆమెలోని మాతృత్వానికి
తాను ఆశీర్వచనం పలుకుతున్నట్టు ఒక్కసారి గర్జించింది ఆకాశం. అదే
నిర్మలత్వంతో థెరిసా తన స్కూలుకేసి అడుగులు వేసింది. తానెప్పుడూ ఆ
వీధులెంబడి వెళ్లలేదేమో.. అక్కడ శ్వైరవిహారం చేస్తున్న అంతులేని దారిద్ర్యం
చూసి మరింత చలించిపోయింది. అక్కడ జనం పడే వేధన చూసి తల్లడిల్లిపోయింది.
స్కూల్లో పనిచేసే కుక్ హరీ సాయం అందించడంతో అక్కడి నుంచి బయట పడగలిగింది.
చర్చిలోకెళ్లగానే ఫాదర్.. సిస్టర్ థెరిసా నన్ గా మీకిదే ఆఖరు రోజంటూ ఒక
లేఖనిచ్చాడు. దాన్ని దైవాజ్ఞగానే భావించింది. మొత్తానికి ఆ లెటర్లో ఒక
ఏడాది పాటూ బయటికెళ్లి సేవచేయడానికి అవకాశం లభించినట్టు రాసుంది. ఆ
క్షణం... ఏసు నీలపు అంచుగల తెల్లచీర ధరించి చర్చిలోంచి బయటకు
నడిచెళ్తున్నట్టు.. కనిపించింది థెరిసా. ఎవరైనా కోరి కోరి కష్టాలను
కౌగిలించుకుంటారా? థెరిసా చేస్తుంది. ఎవరైనా ధనవంతులతో కలిసుండాలని
కోరుకుంటారు కానీ, పేదలతో ఉండాలని కోరుకుంటారా? థెరిసా చేస్తుందా పని.
ఎవరైనా భవంతులొదిలి పేదలలోగిళ్లలోకెళ్లి బతుకునీడ్చాలనుకుంటారా? థెరిసా
అనుకుంటుందలా. ఎవరైనా చేతిలో చిల్లిగవ్వ లేకుండా సేవ చేయాలనుకుంటారా?
థెరిసా చేస్తుందలా. ఎవరికైనా పేదల ముఖాల్లో దేవుడు కనిపిస్తాడా? థెరిసాకు
అలాగే అనిపిస్తుంది.
ఒక క్రైస్థవుడి సాయంతో ఒక విడది దొరుకుతుంది థెరిసాకు. సేవలో భాగంగా
తొలి అడుగు తనకు మంచాలు గించాలు వద్దంటుంది. కేవలం ఒక బల్ల కుర్చీ చాలని
గది సర్ధుతుంది. ఇక సేవ చేయడం మొదలు పెట్టాలనుకుని కలకత్తాలోని మోతిజిల్
స్లమ్ కొస్తుంది. నేనూ మీవంటి పేదనని మీకు సాయం చేయాలని వచ్చాననీ. మనమందరం
కలసి పనిచేద్దామనీ. మీ పిల్లలెలా చదవాలో నేను నేర్పుతాననీ అంటుండగా ఒక
అరుపు. అటుగా వెళ్లి చూస్తే ఒక మహిళ బిడ్డను కంటూ ఆపసోపాలు పడుతోంది.
కొన్ని ప్రారంభాలు ఇలాగే ఉంటాయా అన్నట్టు.. ఆ దృశ్యం చూసి కళ్లు తిరిగి
కింద పడిపోయిందామె. భారతదేశానికి వచ్చిన ఏసు ప్రభువు మదర్ థెరిసా. పేదల
కష్టాలను కంటినిండా నింపుకుని ఉండేది. వారి సాధక బాధకాలు తనవిగా భావిస్తూ
ఆలోచిస్తూ వుండేది. బీదాబిక్కి అంటే దేవుడికిష్టం. వారి కష్టనష్టాల్లో
పాల్పంచుకోవడం అంటే ఆయనకు సాయం చేయడం. ఇదే ఆమె ఆలోచన. తనకే ఆహారం దక్కేది
అంతంత మాత్రం. అది కూడా ఆ పిల్లలు పట్టుకెళ్లిపోయేవాళ్ళు.
అది సరే, ఎక్కడ సిస్టర్ థెరిసా? ఎక్కడ రామాయణం? ఆ కథలతోనైనా ఆ
మురికివాడల పిల్లలకు దగ్గర కావచ్చేమో అన్నది ఆమె తపన. అలాగైనా వారికి
పాఠాలు మొదలు పెడితే అన్న తలంపు. అనుకోకుండా ఆ భూదేవి ఒక్కో సారి పలకగా
మారేది. ఆమె చేతిలోని చిన్ని కర్ర బలపంలా ఒదిగిపోయేది.భలే బడి. భూమి పలక,
కర్ర బలపం. ఆ మురికివాడలో చెట్టుకింది ప్రదేశానికి కొత్త కళొచ్చింది. దారి
తప్పి దివి నుంచి భువికి ఆ శారదాదేవి విచ్చేయలేదు కదా అనిపించింది.
చేయందిస్తే చేయందించడం మానవ నైజం. నువ్వు పాఠం నేర్పితే ఓ పంతులమ్మా.. మేం
కుర్చీలేస్తాం అంటూ ముందుకొచ్చారు అక్కడి మహిళలు. అది ఆ తల్లికి దక్కిన
తొలి గౌరవం. థెరిసా పాటం చెబితే అది కష్టంగా వుండదు. ఎంతో ఇష్టంగా
వుంటుంది. పెద్దలు కూడా వచ్చి నేర్చుకునేందుకు కూర్చునే వారు. ఇంతలో ఆ
విద్యా యజ్ఞంలో పాల్గొనడానికి నల్ల బల్ల తెల్ల చాక్పీసులు కూడా వచ్చి
చేరాయి. చదువు జోరందుకుంది. అంతే కాదు వారి మనసులను విజ్ఞానవంతం చేస్తూనే,
సబ్బులిచ్చి దేహాలకు పట్టిన మురికి సైతం వదిలించే ప్రయత్నం చేసిందామె. అసలు
టీచర్ అంటే ఎలా వుండాలో థెరిసాను చూసి నేర్చుకోవాలి.
యురోపియన్ మహిళ. ఇక్కడికొచ్చి పాఠాలు నేర్పిస్తూ పనిలో పనిగా తమ
దేవుడ్ని ప్రార్ధించమని చెబుతుంది. ఏ స్వార్ధం లేకుండా ఆమెకు ఇక్కడేం పని? ఆ
చుట్టుపక్కల కొందరి అనుమానం. వారి అనుమానాలకేంగానీ, థెరిసా లేకుంటే ఎందరో
నిరాశ్రయులై వుండేవారు. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయి వుండేవారు. వేలాది
మంది నిరక్షరాస్యులై వుండేవారు. లక్షలాది మంది సరైన వైద్యం అందక జబ్బుల
బారిన పడి ఉండేవారు. వ్యాధులొచ్చిని వారికి సేవ చేయడంలో భాగంగా నేరుగా
తాకుతూ.. తాను జబ్బుల బారిన పడిపోయేది థెరిసా.ఆమె సేవలకు మెచ్చి పాట్నా
నుంచి చెప్పులు బహుమతిగా వచ్చాయి. థెరిసా మీ.. మిషన్ ఆఫ్ చారిటీ
కొనసాగాలన్న విషస్ అందేవి. ఆ మాట ఆమెలో బలంగా నాటుకునేది. మిషన్ ఆఫ్ చారిటీ
అన్న మాట నెమరు వేసుకునేదామె. ముఖ్యంగా.. వృద్ధులు, పిల్లల విషయంలో
చలించిపోయేది థెరిసా. వారి ఏడుపు, దీనమైన చూపులూ ఆమెను నిలువనివ్వవు.
ఏడుస్తున్న పిల్లాడ్ని ఎత్తుకుని ఆరోగ్యం అక్కడికక్కడే పరిశీలించేది.
ఒక్కోసారి ఆ కన్నతల్లులు థెరిసా మీద కోపానికొచ్చి గొడవకు దిగేవారు. ఈ
పిల్లాడికి జబ్బుగా వుందని ఆమె ఎంత చెప్పినా జనం వినకపోయేవారు. ఆ గొడవ
మరెక్కడికో దారితీసేది. ఆమె ద్వారా సాయం పొందిన యువకుడొకడు కాపాడకుంటే ఆ
రోజు పెద్ద గొడవే జరిగి వుండేది.
బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశం నుంచి ఎన్నో దోచుకెళ్లింది. థెరిసా లాంటి
ఆణిముత్యాలను మాత్రం ఎందుకనో వదిలి వెళ్లింది. వాళ్లిచ్చిపోయిన
స్వతంత్ర్యమన్నా అంత విలువైందో కాదో తెలియదుకానీ, థెరిసా అంతకన్నా ఎక్కువ.
స్వాతంత్రానికి మించి ఈ ప్రజలకు కావాల్సింది ఎంతో ఉందని తెలిపిందామె
పనితనం. మురికివాడల్లో దారిద్ర్యాన్ని పారదోలడంలో విశేషంగా కృషి చేసిందామె.
మొత్తానికి ఆ మురికి వాడలో ఒక చిన్ని ఆసుపత్రి ఐతే వెలసింది. అలాగే
కలకత్తా కార్పొరేషన్ నుంచి ఒక స్కూలు ఏర్పాటుకు పరిమితి లభించింది కూడా.
ఇంతలో అనుకోని విపత్తు. మోతిజిల్ మురికివాడలను ఖాళీ చెయ్యడానికని సిటీ
పోలీస్ కమీషనర్ వచ్చాడు. ఆమె అతడి ప్రయత్నం అడ్డుకుంది. ఎవరునువ్వు? నీకు
వారికీ ఏం సంబంధం? అడిగాడా అధికారి. నాకు వారికీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల
సంబంధం. అందామె. వారిలో కొందరు థెరిసా వ్యతిరేకులు ఆమె మాకేం కాదు. మీతో
పాటు పట్టుకెళ్లండని చెప్పారు. వీరికా నువ్వు వత్తాసు వస్తున్నావ్? అంటూ
కమీషనర్ అవహేళన చేసాడు. తననెవరైతే వ్యతిరేకించారో వారిని అరెస్టు చేస్తే ఆ
కుటుంబాలకెంత నష్టమో విడమరచి చెప్పింది థెరిసా. చలించిపోయారా అభాగ్యులు.
థెరిసా యురోపియన్ కాదు ‘అవరోపియన్’ అన్న భావన వారిలో మెదలిన సమయమదే.
కమీషనర్ తోక ముడిచిన టైం కూడా అదే కావడం విశేషం.
చర్చి నీడలో ఇన్నాళ్లూ చదివిన చిన్నారులందరూ తమ అభిమాన టీచర్ సిస్టర్
థెరిసాతో కలసి స్లమ్ లో సేవచేయడానికి ముందుకు రావడం ఊపందుకుంది. సునీత,
మరియ ఇలా ఎందరో బాలికలు స్కూలు అయిపోగానే థెరిసా బాటలో నడవడానికి
సిద్ధపడ్డారు. ఆర్చ్ బిషప్ కు మతి పోయింది. థెరిసాను బయటకు పంపితే ఎంత
ప్రమాదమో ఇప్పుడు తెలిసిందా? అంటూ ధుమధుమలాడాడు. దేవుడెక్కడుంటే చర్చ్
అక్కడికే వెళ్తుంది. దైవసహాయకులూ అక్కడికే చేరుతారు. ఇందులో అనుమానమేముందీ?
చర్చి నుంచి తిరిగొచ్చెయ్యమని ఆహ్వానం అందింది. తనకు వీలు కాదని
చెప్పింది థెరిసా. నువ్వొక్కదానివైతే పర్లేదు కానీ, అమాయక ఆడపిల్లలు నీ
వెంట నడుస్తున్నారు అదే సమస్య అన్నాడు ఫాదర్. అది ప్రాబ్లమ్ కానే కాదు.
మిషనరీస్ ఆఫ్ చారిటీ రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు జరిగిపోయాయి. మేమెంతో
పకడ్బందీగా మాసేవలను విసృతం చేయాలనుకుంటున్నాం అంటుంది థెరిసా. 1950,
అక్టోబర్ ఏడున ఆ రిజిస్ట్రేషన్ పూర్తయింది కూడా. ‘ఏంజల్ ఆఫ్ స్లమ్స్’ అంటూ
పత్రికలు కితాబునిస్తూ రాయడం అప్పటికే మొదలు పెట్టేశాయి.
సహాయకుడైన హిందూ యువకుడితో కలకత్తా కాళీ మందిర్ వచ్చింది థెరిసా.
దేవాలయానికెదురుగా వున్న విశ్రాంతి మందిరం చూసి ఇది తన హాస్పిటల్ కు
కరెక్టుగా సరిపోతుందని భావించింది. ఇది హిందూ పవిత్ర ప్రదేశం.. అని అతడంటే
దాన్ని మరింత పవిత్రం చేద్దాం అంటుందామె. మళ్లీ కమీషనర్ అడ్డు తగిలాడు.
ప్రతి రోజు ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటుంటే తన గుండె కూడా అనుక్షణం
పగులుతుంటుందని.. అలాగని 300ఏళ్ల చరిత్ర గల సంస్కృతిని అందుకు ఫణంగా
పెట్టేస్తామా సిస్టర్.. అంటూనే వారించాడు. ఎక్కడో ఒక చోటు బిగినింగ్
కావాలికదా? మరణించే వారు మరణిస్తూనే ఉంటే ఎలా? దారి వదలండి ప్లీజ్
అంటుందామె. సహాయక అధికారి కూడా ఆమె మాటలను గౌరవించక తప్పదంటూ కమీషనర్ని
సంతకం పెట్టమని ప్రేరేపిస్తాడు. దటీజ్ సిస్టర్ థెరిసా. ఆమె తెల్లచీర
కట్టుకొచ్చిన కాళిక. మాటలు మెత్తగానే వుంటాయిగానీ, చేతలే కాళికామాత
చేతిలోని ఆయుధాల్లా అత్యంత పదునుగా వుంటాయి. ఎంతటి కమీషనర్లైనా ఆమె
సేవానిరతి ముందు తలవొంచాల్సిందే. తప్పదు. దాంతో దేవాలయానికెదురు కొత్త
దేవాలయానికి అంకురార్పణ జరిగింది.
కలకత్తా చర్చి కూడా ఆమె ఎదుగుదల ఒక పక్క వ్యతిరేకిస్తూనే మదర్
బిరుదునిచ్చి సత్కరించింది. ఇప్పుడామె సోదరి కాదు.. తల్లి. మాతృమూర్తి. తన
కలకత్తా స్లమ్ పీపుల్ పాలిట గ్రేట్ మదర్.తొమ్మిదేళ్లనాడు తండ్రి చనిపోయి
అనాధగా మారిన ఒక బాలిక. ఇలా సేవకురాలిగా మారడంలో భాగంగా తన కుంటుంబాన్ని
దాదాపు త్యజించి.. ఏళ్ల తరబడి పేదల సేవలోనే దైవం వుంటాడని గ్రహించి ఒక్కో
అడుగూ వేసుకుంటూనే వెళ్లింది. ఎక్కడి వరకూ అంటే ఆమెకు ప్రపంచంలోనే అత్యంత
ప్రతిష్టాత్మకమైన నోబుల్ శాంతి బహుమతి లభించేంత. భారతదేశంలోనే అత్యంత
గౌరవనీయమైన పౌరపురస్కారమైన భారతరత్న పొందేంత. అంతేకాదు మదర్ థెరిసా సేవలు
మెచ్చి చెక్ రిపబ్లిక్ స్మారక పతాకం ఆవిష్కరించింది. అమెరికా మెడల్ ఆఫ్
ఫ్రీడం ఇచ్చి సత్కరించింది. పోప్ జాన్ శాంతి అవార్డు, బాల్జాన్ అవార్డులను
సైతం అందుకుంది. మహనీయ మదర్ థెరిసా 1997 సెప్టెంబరు 5న తనువు చాలించారు.
ప్రస్తుతం.. బాలలు, వృద్ధులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, పేదల బాగోగులను
కోరుతూ.. 87దేశాల్లో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ
సేవలందిస్తోంది.
ఆమె స్వర్గద్వారం దగ్గర నిలుచుని ఉంది. అక్కడికొచ్చిన సెయింట్ పీటర్..
‘ఇక్కడ నీకోసం గుడిసెలు లేవు. పేదవాళ్లు అంతకన్నా లేరు. నీవు భూమి
మీదకెళ్లడమే బెటర్’ అని చెప్పారట. ఇదొక కల. కానీ వాస్తవం అదే. మంచిదనానికి
ఆమెకు మించిన ఉదాహరణ లేదు. మదర్ హేట్సాఫ్ టూ యువర్ సర్వీస్. దేశమేదైనా నీ
సేవానిరతికి మా వందనం.
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ (AUG26 1910)
wish you happy birthday our mother ఓ మై మదర్! ... |
--((***))--
భారతీయ శాస్త్రీయ సంగీత జగత్తులో అధిష్ఠాత - ముత్తుస్వామి దీక్షితులు - జయంతి - 24 ఆగష్ట్
ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు . వాతాపి
గణపతిం భజే అన్న కీర్తన విననివారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. అది ఆయన
రచించినదే. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల
సంతానంగా 1775లో పుట్టాడు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన
బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు
శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. సంగీతంపై వెలువడిన
"వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంధం "చతుర్దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు.
కావలసినమేరకు మన ధర్మ గ్రంధాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.
చిదంబరనాధ యోగి ముత్తుస్వామి దీక్షితర్ను కాశీకి తీసుకెళ్ళాడు. అక్కడ
ఇతడిని ఉపాసనా మార్గంలో అతడు ప్రవేశపెట్టాడు. వారణాసిలో ఉన్నప్పుడు
ముత్తుస్వామి ఉత్తరదేశపు సంగీతమైన హిందూస్తానీ కూడా నేర్చుకున్నాడు.
"శ్రీనాధాధి గరుగుహోజయతి" అనే మాటలతో ప్రారంభమయ్యే తొలి కీర్తనను ఇతడు
రచించి రాగం కూర్చాడు. తిరుత్తణిలో వెలసిన శివుడి కుమారుడైన మురుగ భగవానుడి
భక్తిపారవశ్యంలో లీనమైనప్పుడు పై సంకీర్తనను అతడు రచించాడు. ఆధ్యాత్మిక
వెలుగులో ఇతడి సృజనాత్మకత ప్రతిభ ప్రకాశించింది. తన శిష్యులను ఎంతో
జాగ్రత్తగా ఎన్నుకున్న వారికి తన కృతులను ఆలాపించడం బోధించాడు.
తన
తమ్ముడు చిన్నస్వామి చనిపోయినప్పుడు ఆ దుఖంలో ఉన్నప్పుడు మదురై మీనాక్షి
అమ్మన్ ఆలయాన్ని దర్శించాడు. అక్కడే అతడు "మీనాక్షి మేముదం దేహి, మామన
మీనాక్షి" అన్న కీర్తనలను వరుసగా పూర్వీ కళ్యాణి, వరాళి రాగాలలో ఆలపించాడు.
ధ్యాన యోగం, జ్యోతిష శాస్త్రం, మంత్ర యోగం, పురాణాల సారం మొదలైనవి
దీక్షితర్ కృతులలోని ప్రత్యేకతలు. అంబాళ్పై అతడు రాసిన నవవర్ణ కీర్తనలు,
నవ గ్రహాలపైన రాసిన నవగ్రహ కీర్తనలు ఆయన రచనా గొప్పతనానికి ఉజ్వల ఉదాహరణలు.
శక్తి ఉపాసనలోని సూక్ష్మాలను వివరిస్తూ శ్రీ విద్యా తత్వ రహస్యంపై ఇతడు
ఎన్నో కీర్తనలను రచించాడు. "శివ పాహి ఓం శివే" అన్న మంత్రాన్ని
ఉచ్చరిస్తున్నవేళ 1835లో తనువు చాలించాడు.
అటువంటి అత్యద్భుతమైన
కృతులను రచించిన ముత్తుస్వామి దీక్షితులు సంగీతత్రయంలో త్యాగరాజు తర్వాత
రెండవవారిగా పరిగణింపబడతారు. రామస్వామి దీక్షితులు వీరి తండ్రి. వీరు
సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన
వ్యక్తి. గురుగుహ ముద్రతో వున్న వీరి కృతులన్నీ సంస్కృతంలోనే వున్నవి.
హిందూస్థానీ సంగీతం నుండి వీరు కర్ణాటక సంప్రదాయానికి వీరు తెచ్చిన రాగాలు
సారంగ, ద్విజావంతి మొదలైనవి. వీరు అనేక క్షేత్రములు తిరిగి ఆయా ప్రదేశములలో
వున్నట్టి దేవస్థానములను సందర్శించి దేవతలపై కృతులు జేసారు. ఆయన రచించిన
కృతులలో కమలాంబా నవవర్ణ కృతులు, నవగ్రహ కీర్తనలు ప్రత్యేక స్థానాన్ని కలిగి
వున్నాయి.
వీరి యితర ప్రముఖ రచనలు:
వాతాపి గణపతిం భజే,
మహా గణపతిం,
శ్రీనాథాది గురుగుహో,
అక్షయలింగ విభో,
బాలగోపాల,
అఖిలాండేశ్వరి,
రామచంద్రం భావయామి,
చేత: శ్రీబాలకృష్ణం,
శ్రీ వరలక్ష్మి,
సిద్ధి వినాయకం,
త్యాగరాజ యోగవైభవం,
హిరణ్మయీం,
అన్నపూర్ణే,
అరుణాచలనాథం,
ఆనందామృతకర్షిణి,
మామవ మీనాక్షి,
మీనాక్షి మే ముదం దేహి,
నీలకంఠం భజే,
స్వామినాథ,
శ్రీ సుబ్రహ్మణ్యాయ,
పరిమళ రంగనాథం, మొదలైనవి.
పరమ పూజ్యులు, సంస్కృత భాషా పండితులు, శాస్త్రీయ సంగీత స్రష్ట పూజ్యులు
శ్రీ ముత్తుస్వామి దీక్షితులు వారి జయంతి సందర్భంగా ఘన స్వరరాగ నివాళిని
'తెలుగురధం సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ, తెలుగురధం.
--((***))--
| ||||||||||||
దమ్ముంటే
ఇక్కడ కాల్చరా..’ అంటూ పోలీసులకు తన గుండెను చూపించి ధీశాలి టంగుటూరి
ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుకు
హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కూడా మంచి సంబంధాలుండేది.. నిజాం
నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టేట్ కాంగ్రెస్ కు
దిశానిర్దేశం కూడా చేసేవారు.. ఆ సందర్భంలో ప్రకాశం పంతులు ఒకసారి తెలంగాణకు
వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం ప్రభుత్వం ఆయన బస చేసిన ప్రాంతానికి
విచారణ కోసం ఓ పోలీసును పంపింది.. అక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
నాయకుల నడుమ పంతులు గారు ఠీవీగా కూర్చున్నారు.. వచ్చిన పోలీసాయన ఇదర్
‘టాంగ్ టూటీ పీర్ ఖాసిం’ కోన్ హై అంటూ ప్రశ్నించాడు.. పోలీసు చేతిలో ఉన్న
లేఖలో టంగుటూరి ప్రకాశం పేరు ఉర్దూలో రాసి ఉంది.. అది ఆయనకు అర్ధం కాక
టాంగ్ టూటీ పీర్ ఖాసిం (కాలు విరిగిన పీర్ కాసిం అనుకున్నాడు.. అక్కడ ఉన్న
కాంగ్రెస్ నాయకులంతా ఒకరి మోహాలు ఒకరు చూసుకొని ‘ఇదర్ కిసీకా టాంగ్ నహీ
టూటీ..’ (ఇక్కడ ఎవరి కాలూ విరగలేదు) అని చూపించారు.. అందరి కాళ్లూ
పరిశీలించిన పోలీసాయన టాంగ్ టూటీ పీర్ ఖాసి ఎవరూ లేరని నిర్ధారిచుంకొని
వెళ్లిపోయారు.. అన్నట్లు ప్రకాశం పంతులుగారు మంచి భోజన ప్రియులు.. ఆ
సమావేశంలో పాల్గొన్న వారి కోసం గంపెడు ఇడ్లీలు తెస్తే సగం ఆయనే లాగించారట..
ఈ విషయం దాశరథి కృష్ణమాచార్యుల జీవిత కథ యాత్రాస్మృతిలో రాసి ఉంది..
టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143వ జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుందాం..
--((**))--
20 ఆగస్టు ప్రపంచ దోమల దినోత్సవం (20 Aug World Day of Mosquitoes) “మాపెద్దాయన వచ్చాకే హైద్రాబాద్ పెందలకడ నిద్రలేవడం నేర్చుకుంది.” హైద్రాబాద్, తెలంగాణా చరిత్రను అపహాస్యం చేస్తూ ఓ ముఖ్య రాజకీయ నాయకుడు ఇటీవలే పేలాడు. మానవాళికి ప్ర్రాణాంతకమైన ‘మలేరియా’ వ్యాధి కారకాన్ని హైద్రాబాద్ ప్రపంచానికి ప్రకటించిన రోజు ఆ పెద్దాయన కానీ, ఈ పేలిన పెద్దమనిషి కానీ కళ్ళుతెరవలేదు. అదేమిటో తెలుసుకుందాం! ************** ఉష్ణమండల ప్రాంతాల్లో లక్షలాదిగా ప్రాణాలను బలిగొన్న మలేరియా వ్యాధికి కారకమైన పరాన్న జీవినీ, దాన్ని రోగినుండి మరో మనిషికి మోసుకొచ్చే ఎనఫిలిస్ దోమనూ సర్ రోనాల్డ్ రాస్ 1897 సం||లొ సరిగ్గా ఇదేరోజున హైద్రాబాద్ బేగంపేట సమీపంలోని పాత మిలిటరీ ఆస్పత్రిలో గుర్తించాడు. అందులో ప్రస్తుతం సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసైటాలజీ ని నెలకొల్పారు. ఈ పరిశొధనకోసం రోనాల్డ్ రాస్ హుస్సేన్ ఖాన్ అనే వ్యక్తికి ఆదోమతో ఒకసారి కుట్టించుకొవడానికి ఒక పైస చొప్పున ఇచ్చాడు. ఆవిధంగా ప్రయోగశాలలో ఆగస్టు 20వ తేదీ (1897)న 8సార్లు కుట్టించుకున్న తర్వాత రోనాల్డ్ రాస్ ఆదోమనుచంపి డిసెక్ట్ చేసి కణ కణం శొధించి ఆ దోమ గర్భంలో మలేరియా పరాన్నజీవి ఉందని కనుగొన్నాడు. తన పరిశోధనను ది 22వ తేదీన ప్రకటించాడు. ఈ పరిశోధన ఆయనకు 1902లో నోబుల్ వైద్యశాస్త్ర బహుమతి పురస్కారాన్నేకాక, ఉష్ణమండలాల్లో నివసించే కోట్లాదిమంది ప్రజలకు ఊరట కల్గించింది. రోగ కారకంనిర్ధారకం జరిగినందువల్ల ఆవ్యాధినిరోధానికి పరిశోధనలు ప్రారంభమయ్యాయి మలేరియా వ్యాధితో అస్తవ్యస్తమైన ఉష్ణమండలదేశాలు, వైద్య శాస్త్రవేత్తలు ఆయన పుట్టిన రోజైన మే 13వ తేదీని మలేరియా దినోత్సవంగా జరుపాలని ప్రతిపాదిస్తె అందుకు రోనాల్డ్ రాస్ తిరస్కరించి తన పరిశోధన ఫలించిన రోజైన ఆగస్టు 20 తేదీని దోమల దినోత్సవంగా జరిపి ప్రజల్లోదోమల గురించి, మలేరియా నివారణ గురించీ అవగాహన పెంచేవిధంగా కృషి చేయాల్సిందిగా కోరాడు. దోమల గురించి ఆసక్తికరమైన విషయాలు (నేషనల్ జాగ్రఫిక్ చానల్) దోమలు దాదాపు 3వేల రకాలు. ఐతే వ్యాధులను వ్యాపింప జేసేవీ, ప్రాణాంతకమైనవీ కేవలం మూడు రకాలే. అవి (1) అనాఫిలిస్ దోమవల్ల మలేరియా మరియు బోదెకాలు సంభవిస్తాయి. (2) క్యూలెక్స్ దోమతో బోదెకాలు, వెస్ట్ నైల్ వైరస్ సంభవిస్తాయి. (3) ఏడెస్ దోమలతో యెలొ ఫీవర్, బోదెకాలు, డెంగూ వ్యాధులు సంభవిస్తాయి ఈదోమలు మనం వదిలిన బొగ్గుపులుసు వాయువు, శరీరపు దుర్వాసన, ఊష్ణోగ్రతలను స్వీకరించి తిరిగి మనపైననే దాడిచేస్తాయి సాధారణంగా ఆడమగ దోమలన్నీ ఆహారంకోసం మొక్కలనుండి చక్కెరను స్వీకరిస్తాయి. ఆడదోమలు మాత్రం తమ గర్భంలోనున్నగుడ్లకోసం మానవుల రక్తాన్ని తీసుకుంటాయి. ఆ రక్తంలోనే మలేరియా పరాన్నజీవి ఉంటుంది. పైగా ఆడదోమల నోరుమాత్రమే మానవుల రక్తాన్ని పీల్చడానికి అనుకూలంగా ఉంటుంది. నిలకడగా ఉన్న నీటిలోనే దోమల ఉత్పత్తి జరుగుతుంది. వీటి నివారణకు నిలిచిఉన్న నీటినితొలగించడం ప్రధమ కర్తవ్యం. కీటక, క్రిమి సంహారకాలు వాడుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్రమంగా భూపరితాపం పెరుగుతుండంవల్ల వీటి జీవనానికి అనుకూలమైన వాతావరణం పెరుగుతున్నది. భూతాపానికి కారణమైన ఉద్గారాలను తగ్గించగల్గినప్పుడే వీటిని నియంత్రించడం సాధ్యమౌతుంది. దోమల ఉత్పత్తికి, వ్యాప్తికీ దోహదపడే ఉద్గారాలను నియంత్రించి వీటి నియంత్రణకు కృషిచేయడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. | ||||
|
19 ఆగస్టు ప్రపంచ మానవతా దినోత్సవం (19 Aug World Humanitarian Day)
“ప్రమాదసమయాల్లో బాధితులకు అండగా, ఆసరాగా నిలవడానికి మేము పంపించినవారే సహాయ సేవకులు. మానవ జాతికీ మానవత్వానికీ అత్యుత్తమ ప్రతీకలు. దురదృష్టవశత్తూ వారి విద్యుక్తధర్మమే వారిపట్ల ప్రాణాంతకమౌతున్నది”.--బాంకీ మూర్- ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పోర్చుగీసు దేశానికిచెందిన సేర్గియోవియెన్నరా డె మెలో ఐక్యరాజ్యసమితిలో వివిధ రంగాల్లో 34 సం||లుగా సేవలందించాడు. ఇరాక్లో సహాయపునరావాస కార్యక్రమాల నిమిత్తం ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి ప్రత్యేక ప్రతినిదిగా 2003సం|| లో నియమించబడ్డాడు. ఆ కాలంలో అతను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కాగలడని ప్రపంచవ్యాప్తంగాచర్చ జరిగింది. సహాయపునరావాస కార్యకలాపాల కార్యాలయం బాగ్దాద్ నగరంలొని కెనాల్ హోటల్లో నెలకొల్పారు. ఆగస్టు 19 వతేదీ (2003)న మధ్యాహ్నం 3 గం||లకు అల్ ఖెదా తీవ్రవాదులు హొటల్పై శక్తవంతమైన బాంబు పేల్చారు. ఆదాడిలో సెర్గియియో, ఐక్యరాజ్యసమితి విలేకరిగా పనిచేసె రెహం అల్ఫెరా అనే మహిళా పాత్రికేయురాలి తోపాటు మరో 22మంది సిబ్బందిప్రాణాలుకోల్పోయారు. వీరితోపాటు మరోవందమంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అల్ ఖెదాకు చెందిన అబూ ముసాబ్ జర్ఖావీ తామే ఆబాంబుదాడి చేశామని ప్రకటించాడు. పునరావాసచర్యలకోసం వచ్చిన సిబ్బందిలో అత్యధికులది ఆదేశంకాదు. తీవ్రవాదుల దాడిలోనూ, అంతర్గత పోరాటాల్లోనూ అనేక విధాలుగా బాధలుపడ్తున్న పౌరులకు కేవలం సహాయపునరావాస చర్యలకోసం మానవతాదృష్టితోనే ఆదేశానికి వచ్చారు. ఇస్లామిక్ తీవ్రవాదులు వారిపైన్నే దాడిచేయండం మానవతకే తీరని మచ్చ. ఇటువంటి హీనమైన చర్యలు ప్రపంచ బాహుళ్యానికి తెల్యడంకోసం, పౌరసమాజం ఇటువంటి చర్యలను ఖండించాలనీ కోరుతూ బాంబుదాడిజరిగిన ఆగస్టు 19వ తేదీని ప్రతీసంవత్సరం ప్రపంచ మానవతా దినంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మరుసటి సం|| సెర్గియియోకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పురస్కారాన్ని ప్రకటించింది. బాధితుల సేవలో అసువులుబాసిన వారందరికీ నివాళులర్పిద్దాం. ఉగ్రవాదం- అంతంకావాలనీ, ఐక్యరాజ్య సమితి వర్ధిల్లాలనీ నినదిద్దాం. చాయాచిత్రాలు:, ధ్వంసమైన కెనాల్ హోటల్లో ఒక భాగం, ధ్వంసమైన ఐక్యరాజ్య సమితి పతాకం, సెర్గియియో | ||||
|
--((***))--
15 ఆగస్టు (1948) హైద్రాబాద్లో ఝండావందనం (15 Aug [1948] Flag hoisting in Hyderabad)
నిజాం 1948 లో స్వాతంత్ర్యోత్సవాలను నిషేధించాడు. ఉవ్వెత్తున ఎగిసిపడె
జాతీయ భావంతో నిజాం రాష్ట్ర ప్రజలు ఎక్కడికక్కడే మూడు రంగుల ఝండాను
ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్ర మహాసభ (అతివాదులు), స్టేట్
కాంగ్రేస్ (మితవాదులు) ఝండావందనంతో పాటు సభలు, సమావేశాలు జరుపాలని
పిలుపునిచ్చారు.
నిజాం తన సంస్థానంలొ తన ఝండాతప్ప మరోటి ఎగురవధ్దని ఆదేశించాడు. ముందు
రాత్రికిరాత్రే స్వామి రామానందతీర్ధ, మెల్కోటే, అచ్యుత్రావు దేశ్పాండే,
జగన్నాధరావు బర్దార్పూర్కపూర్లను అదుపులోకి తీసుకున్నారు.
హైద్రాబాద్లో మొదటి పతాకావిష్కర్త: రఫీ అహ్మద్
ఆల్ హైద్రాబాద్ స్టుడెంట్స్ యూనియన్ కార్యాలయం,ట్రూప్ బజార్- కింగ్ కోఠీకి(నిజాం నివాసం) వందగజాల దూరం
సమయం: ఉదయం 10 గం||లు
వందమందికి పైగా ఆల్ హైద్రాబాద్ స్టూడెంట్స్ యూనియన్ విధ్యార్ధులు
“భారత్ మాతాకీ జై” హైద్రాబాద్ రాజ్యం-ఇండియన్ యూనియన్లో కలవాలి”,
హైద్రాబాద్లో ప్రజా ప్ర్తభుత్వం – ఏర్పడాలి” అని నినదిస్తూండగా సంఘ
కార్యదర్శి రఫీ అహ్మద్ అనే విద్యార్ధి జాతీయ జండాను ఎగురవేశాడు.
విద్యార్ధులంతా “జనగణమణ’ పాడారు.
మహిళల్లో శ్రీమతి బ్రిజ్ రాణీ గౌర్,విమలాబాయిమెల్కోటే, యశోదా బెహ్న్,
శ్రీమతి హెడా, అహల్యాబాయి మొదలైన వారు వివిధ ప్రాంతాల్లో జాతీయ
పతాకాన్నిఎగురవేశారు. తదుపరి వీరిని పోలీసులు అరెస్టు చేయడం, కేసులు
పెట్టడం మిగితా కధంతామమూలే.
ఎక్కడైతే ముస్లింరాజ్య స్థాపనకు ప్రయత్నం జరిగిందో అక్కడే ఒక ముస్లిం
విద్యార్ధి జాతీయ జండాను ఎగురవేయడం విశేషం. హైద్రాబాద్ ముస్లింలలో జాతీయ
వాదులున్నారనడానికి ఇదొక నిదర్శనం. దురదృష్టవశత్తూ ఇది ప్రచారంలోకి
రాలేదు.
నిజాం నూ ఎదిరించిన ముస్లీం లు, రజ్వీని విమర్శించిన పలువురు జాతీయ వాద
ముస్లిం లు ప్రాణాలు కోల్పొయారు. సందర్భంవచ్చినప్పుడు వారి గురించి
తెల్సుకుందాం.
(వెలపాటి రామరెడ్డి గారి “తెలంగాణాసాయుధ పోరాటం 1948 మరికొన్ని ఇతర గ్రంధాల ఆధారంగా).
| |||||||||
--((***))--
13 ఆగస్టు ప్రపంచ వామహస్తీయుల దినోత్సవం (13 Aug World Left Handed Persons Day)
రాతి యుగంలో లభించిన పనిముట్లు కుడి, ఎడమ రెండు చేతులతో పని చేయడానికి అనుకూలంగా రూపొందించారు. గుహల్లో వేసిన చిత్రాల్లో ఎక్కువగా ఎడమ చేతితో వేసినవేనని చరిత్రకారుల అధ్యయనం ఋజువు చేస్తున్నది. పనిముట్ల ఆధునీకరణ పెరుగుతున్నకొద్దీ కుడిచేతికి ప్రాముఖ్యత పెరిగిందని మానవ పరిణామ శాస్త్రవేత్తల అభిప్రాయం. భూమి ఉత్తరార్ధగోళంలో దక్షిణం వైపు తిరిగి అస్తమయం వరకు సూర్యుడి గమనం చూడాలంటే ఎడమనుండి కుడికి తిరగాల్సిందే. పూర్వం కత్తియుధ్ధం చేసినకాలంలో గుండెకు పూర్తి రక్షణ ఉండటంకొరకు ఎడంచెతిలో డాలును పట్టుకొని కుడిచేత్తో యుధ్ధం చేసేవారు. తదనంతర కాలలో కుడిచేయి ప్రాముఖ్యం పెరిగిందనే మానవ పరిణామ శాస్త్ర అధ్యాయుల అభిప్రాయం. ప్రసవ సమయంలోకలిగే మానసిక ఆందోళన కారణంగా ఎడమచేతివాటం వస్తుందని మరో అభిప్రాయం. ఎడమచేతి వాటంవారికి మంత్రశక్తులుంటాయనేది మరో మూఢ నమ్మకం. కొన్ని మతాల్లో కుడిచేతిని శుభానికీ, ఎడమచేతిని అశుభానికి సంకేతంగా చెబుతారు. మనకు అనుకూలంగా లేని పరిస్థితులనూ, విజయం పొందలేని అవకాశాలనూ "ఎడం చేయి/ ఎడంచేతివాటం"గానే చెప్పుకుంటాం. సమర్ధతలో ఎడంచేతివాటం వాళ్ళు ఎవరికీ తక్కువకాదనీ, అన్నింటా, అందరితోనూ సమానస్కంధులేననీ చెప్పడం ఈ దినం ఉద్దేశ్యం. వామహస్తీయుల కూటమి తొలుత బ్రిటన్లొ సరిగ్గా ఇదేరోజు 1976లో ప్రారంభమైంది. దీనికి గుర్తుగాఈ తేదీని ప్రపంచ వామ హస్తీయుల దినోత్సవంగా 1992 నుండి జరుపుకుంటున్నరు. వీరికి అంతర్జాలంలొ ఒక వెబ్ సైట్ కూడా ఉన్నప్పటికీ పలువురికి ఆసంగతి తెల్యదు. తామెవరికీ తక్కువ కాదనీ, కార్యంలో అపజయంపాలై ఎడమచేతిని నిదించడం సమంజసం కాదని వీళ్ళు చెబుతున్నారు. మన ప్రధాని ప్రత్యర్ధులను ఎడంచెత్తోనే "మోదే" సే విషయం మనందరికీ తెల్సు. క్రికెట్ దేవుడిగా పూజలందుకుంటున్న సచిన్ టెండుల్కర్, భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, ప్రపంచాన్ని 'ఎడం" చేత్తొనే శాశించే ఒబామా, ఆటంబాంబుతో ప్రపంచాన్ని వణికించిన ఐన్స్టీన్, ఇంకా బిగ్ బి- అమితాబ్ బచ్చన్, వీరంతా ప్రముఖులైన వామహస్తీయులు. అన్నట్టు భారత సినిమాల్లో బ్లాక్ బస్టర్ బహు హీరోల సినిమా "షోలే" 40 ఏళ్ళ క్రితం ఈ రోజున్నే విడుదలైంది. ఫేస్బూక్, జీ+, ట్విట్టర్, హైక్, వాట్సప్ల ద్వారా పలకరించుకోవడం, అభినందనలు శుభాకాంక్షలు తెల్పుకోవడం, వీరందరూ నిర్దేశిత ప్రదేశంలో సమావేశమై వినోద కార్యక్రమాలు, క్రీడలునిర్వహించుకోవడంద్వారా తమ సంఘీభావాన్ని తెలుపుకుంటారు. కుడిచేతివాళ్ళతో ఎదురయ్యే ఇబ్బందులను చర్చించుకుంటారు. వామహస్తీయులైన మన మిత్రులకు కూడా శుభాకాంక్షలు చెబుదాం మరి. | ||||
|
12 ఆగస్టు అంతర్జాతీయ జెనీవా ఒప్పంద దినోత్సవం (12 Aug Geneva Conventions Day) యుధ్ధ సమయాల్లో, యుధ్ధం జరిగే ప్రాంతాల్లో పౌరులు, యుధ్ధఖైదీలు, క్షతగాత్రుల వైద్య సేవలు, వసతులకు సంబంధించి ప్రపంచదేశాలు చేసుకున్న నాలుగు వరుస ఒప్పందాలను జెనీవా ఒప్పందాలుగా పిలుస్తారు. ఈ ఒప్పందాల రూపకల్పనలో రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీడ్యునాంట్ (1828-1910) చొరవతో ఈ ఒప్పందాలకు మార్గం సుగమమైంది. ఆగస్టు 12 1949 నాడు జెనీవాలో చేసుకున్న మూడవ ఒప్పందము కీలకమైనందువల్ల “జెనీవా ఒప్పందం”గా వ్యవహరిస్తారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యునాంట్ తీసుకున్న చొరవవల్ల 1864లో మొదటి ప్రతి రూపొందింది. ఇటలీ ఏకీకరణకోసం జరిగిన సోల్ఫెరినో యుధ్ధపు (1859) మారణహోమం ఆ శతాబ్దంలోనే అత్యంత దారుణమైనదిగా చెబుతారు. మొదటగా 1864 లో రూపొందించిన ఒప్పందంప్రకారం యుధ్ధంలో సేవలందించే వైద్య సిబ్బంది, గాయపడినవారికిసేవలందించే సాధారణ పౌరులకు ఈ ఒప్పందం రక్షణ కల్పిస్తుంది. వైద్య పరికారాలు, మందుల సరఫరాను అడ్డగించదు. ఈ ఒప్పందం సమయానికల్లా అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ తటస్థంగా సేవలందిస్తుందని ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయతవచ్చింది. ఈ ఒప్పందంళొ 12 దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా 1882లో 32వ దేశంగా సంతకం చేసింది. రెండవ ఒప్పందం (1864) లో నౌకా యుధ్దాల్లో గాయపడ్డ సైనికులకు, శిధిలమైపోయిన నౌకలకు, నావికులకు సముద్రములోకూడా సేవలందించేవిధంగా నిబంధనలు రూపొందించారు. రెండవ ప్రపంచ యుధ్ధానంతరం గాయపడిన సైనికులు, పౌరులు, యుధ్ధాలతో సంబంధంలెని పాత్రికేయులు, ఫోటొగ్రాఫర్లు, మత పెద్దలు, వైద్య సిబ్బంది రక్షణపై జాతిప్రాంత భావాలకతీతంగా సానుభూతి పెరిగింది. ఆ నేపధ్యంలో జరిగినమూడవ ఒప్పందం (1949) 100 కు పైగా అంశాలతో రూపొందించ బడ్డ సుధీర్ఘ పత్రం. ఓడిపోయినవారిని బందీలుగా తీసుకువెళ్ళటం, వారి అవయవాలు తెగనరకడం, యుధ్ద ఖైదీలను నీచంగా చూడటం,వారితో నీచమైన పనులు చేయించడం, హింసించడం, జాతి,లింగ, మత, వర్ణ వివక్షను ప్రదర్శించడం వంటివన్నీ చట్టవిరుధ్ధమైనవిగా ప్రకటించింది. నాలుగవ ఒప్పందం (1977) లో జరిగింది. ఇందులో గెరిల్లా పోరాటంచేసె సైనికులు, స్వయం ప్రతిపత్తికై పోరాటం చేసె దళాలు అనే రెండు అంశాలను చేర్చారు. అమెరికా అధ్య్క్షుడు సంతకం చేసినా అమెరికా కాంగ్రేసు దాన్ని తిరస్కరించింది. ఇటీవల క్యూబాలోని గ్వాంటనామో ఖాతం ప్రాంతంలో పట్టుబడ్డ తాలిబన్, అల్ ఖైదా ఖైదీల విషయంలో అమెరికా వైఖరి వివాస్పదమైంది. నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఆ ఖైదీలను జెనీవాఒప్పందం పరిధిలోకి రారన్నడు. ప్రపంచ నలుమూలలనుండి వచ్చే వత్తిడిని తలొగ్గి ‘ అఫ్గాన్ జెనీవా ఒప్పందంలొ భాగస్వామి గనక తాలిబన్లు ఖైదీలు కారనీ, ఆల్ ఖైదా పదాన్నే అసలు పట్టించుకోకుండా వారిని చట్టవిరుధ్ధ సైనికులుగా వర్ణించాడు. అంటే తాలిబన్లు, అల్ ఖైదా బందీలను సాధారణ ఖైదీలుగానె పరిమితం చేశారు. ప్రపంచ పోలీస్గా తననుతాను పిలుచుకొనే అమెరికా ‘కాలుకేస్తేమెడకు, మెడకేస్తే కాలుకు’ చందంగా అన్ని ఒప్పందాలను తుంగలోతొక్కి ఒక టెర్రరిస్టుగా వ్యవహరిస్తున్న విషయాన్నిప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు. | ||||||
11 ఆగస్టు తెలంగాణా వీరుడు బత్తిని మొగిలయ్య బలిదానం (11 Aug Telangana Martyrdom of Bathini Mogilayya Warangal)
భారత చరిత్రలో 1946వ సంవత్సరం. బ్రిటిష్ వారిని త్వరలో వదిలించుకోబోతున్నామని యావద్భారతం ఆనందోత్సాహాల్లో ఉంది. నిజాం పాలన (చివరి దశ)లో ఖాసీంరజ్వీ రాక్షస కృత్యాలింకెంత కాలమని హైద్రాబాద్ రాజ్యం విలపిస్తూన్నది. ------------------------------ నిజాం, ఖాసీం రజ్వీ, రజాకార్ల మధ్య తేడా ఏమిటని పలువురు సీమాంధ్ర మిత్రులు అడుగుతున్నారు. సంక్షిప్తంగా ------------------------------ నిజాం: హైద్రాబాద్ రాజ్యానికి రాజు. నాటి హైద్రాబాద్ రాజ్యంలో నేటి తెలంగాణాతో పాటు మహారాష్ట్ఱ, కర్ణాటకల్లోని కొన్నిప్రాంతాలు కలసిఉన్నాయి. ------------------------------ ఖాసీంరజ్వీ: నిజాం రాజ్యాన్ని కాపాడుతాననీ, రాజ్యాన్ని కొనసాగిస్తాననీ ప్రతినబూని, సొంత సైన్యాన్ని సమకూర్చుకొని మతమార్పిడులను నిర్భంధంగానూ, స్వచ్చందంగానూ కొనసాగించేవాడు. ఇతనిపై ఎటువంటి నేరాలు నమోదు కాలేదు ------------------------------ రజాకార్లు: నిజాం రాజ్యాన్ని కాపాడటానికి రజా (మనఃపూర్వకంగా) కార్ (సేవకుడు) ఖాసీం రజ్వీని అనుసరించిన స్వచ్చంద కార్యకర్తలు. దోపిడీలు, మానభంగాలు, ఎదిరించినవారిని చంపేయడం వీరి నిత్యకృత్యాలు. ------------------------------ మందుముల నర్సింహారావు అధ్యక్షతన 12 నిజామాంధ్ర మహాసభలు మెదక్ జిల్లా కందిలో జరిగాయి. నాటి కాకతీయుల నివాసానికీ, పరిపాలనకూ స్థావరమైన వరంగల్ కోట వరంగల్ నగరానికి ఒక చివరన ఉంటుంది. ఈ ప్రాంతం నిజాం వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలకు పేరెన్నికగన్నది. కోట ప్రాంతంతోపాటు పరిసర గ్రామమైన స్థంభంపల్లి యువకులు “సర్వోదయసంఘం” అనే స్వచ్చందసంస్థను స్థాపించి ప్రతీవారం జాతీయ ఝండా ఎగరేయాలని నిర్ణయించారు. అప్పటికే నిజాం పతాకావిష్కరణ, జాతీయగీతాలాపనలను నిషేధించాడు. బత్తిని రామస్వామి గౌడ్, మొగులయ్య గౌడులిద్దరూ సోదరులు. అకుంఠిత దేశ భక్తులు. మొగిలయ్యకు తెగువ చాలాఎక్కువ. అతను కత్తి యుధ్ధంలోనూ, కత్తి తిప్పడంలోనూ బహు నేర్పరి. ఆదివారం ఆగస్టు 11 (1946): వరంగాల్ పట్టణం నుండి నాయకులు తిరువరంగం హయగ్రీవాచారి, వరంగల్ గాంధీగా పేరుపొందిన భూపతి కృష్ణమూర్తి, యం యస్ రాజలింగం వంటి ప్రముఖులతోపాటు రామస్వామి గౌడ్, మొగిలయ్య గౌడ్ల నాయకత్వంలో స్థానికంగా మరో 50 మంది కార్యకర్తలు ఉదయం 7.30 గం||లకు జాతీయ ఝండా ఎగురవేసి గీతాన్ని ఆలపించారు. రామస్వామి ఇంట్లోసమావేశమయ్యారు. మొగిలయ్య కులవృత్తియైన తాటికల్లు సేకరణకు బయటికి వెళ్ళాడు. కోటలో ఝండావందనం విషయం తెల్సుకున్న వరంగల్ రజాకార్ల ముఠానాయకుడు ఖాసీంషరీఫ్ తుపాకులు, జాంబియాలు, కత్తులవంటి మారణాయుధాలతో తూర్పుకోటకు వెళ్ళాడు. ఈ ముఠా 3 జట్లుగా విడిపోయి మూడు మార్గాల్లోనుండి కాంగ్రేస్ నాయకులు ఏవైపున వచ్చినా చంపడానికి సిధ్ధంగాఉన్నారు. ఒక రజాకార్ల ముఠా ఝండాను పీకేసి కాల్చివేస్తుంది. మరోముఠా మొగిలయ్య అన్న రామస్వామి గౌడ్ ఇంటిపై రాళ్ళతో దాడి చేస్తుంది. అక్కడ సమావేశంలో ఉన్న నాయకులు అవే రాళ్ళతో తిరిగి దాడి చేస్తారు. ఇంతలో విషయం తెల్సుకున్న మొగిలయ్య వెనుకవైపునుండి ఇంటిలోదూరి దాచుకున్న కత్తితో రజాకార్ల మధ్యకు వచ్చి ముగ్గురిని తెగ నరుకుతాడు. భయంతో పారిపోయిన రజాకార్లు కొద్దిసేపటి తర్వాత కూడబలుక్కుని మళ్ళీ వస్తారు. అప్పుడు మొగిలయ్య ఒంటరిగా కౌరవమూకలమధ్య అభిమన్యుడిగామిగిలిపోయాడు. షరీఫ్ మొగిలయ్య కడుపులో బర్సీతో పొడుస్తాడు. మొగిలయ్య ఎత్తినకత్తి పందిరిలో గుంజల్లో చిక్కుకుంటుంది. అదే అదనుగా రజాకార్లందరూ మూకుమ్మడిగా మొగిలయ్యపై దాడిచేసి అణువణువునా పొడుస్తారు. తమ్ముణ్ణి చంపవద్దని వేడుకోవచ్చిన రామస్వామిని సైతం కుళ్ళుబొడిచి చచ్చాడని వదిలేస్తారు. వీరి రక్తం వంటినిండా పూసుకొని షరీఫ్ అతని బృమ్దం వరంగల్నగరం వైపు ర్యాలీగా వెళ్తారు. దేశభక్తినీ, జాతీయ భావాన్ని గుండెలనిండా నింపుకొని పోరాడిన వీరునికవి అంతిమ ఘడియలు. తమ భవితవ్యమేమిటో తెల్యని తెలంగాణా/ హైద్రాబాద్ ప్రాంతపరిస్థితి. ఈనాడు మనమింత స్వేచ్చగా జీవిస్తున్నామంటె మొగిలయ్య వంటి పలువురి త్యాగఫలం. వారికి నివాళులర్పించి జోహార్లు చెప్పడం మనందరి కనీస బాధ్యత. ఈ ముద్దుబిడ్డ స్మృతిలో వరంగల్ ప్రాంత నడిబొడ్డున సమావేశ మందిరం కట్టించారు. నేటికీ పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలకు అది కేన్ద్రంగా భాసిల్లుతున్నది. | ||
|
--((***))--
1 ఆగస్టు తెలంగాణా జాతిపిత ప్రొ|| జయశంకర్ జయంతి
(6-08-2015)
ప్రజాస్వామ్య వ్యవస్థలో పీడితులకు అందుబాటులోనున్న ఏకైక మార్గం అహింసాయుత పోరాటం. ఈ పోరాటం త్రిముఖంగా సాగాలి. 1) భావవ్యాప్తి 2) శాంతియుత ఉద్యమం 3) రాజకీయ ప్రక్రియ. ఈ ఎత్తుగడలద్వారానే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.
సామాజిక సమస్యల పరిష్కారానికి ఇదొక్కటే మార్గం. ప్రస్తుత కాలంలో కనిపించే రెండు తీవ్ర సమస్యలు:
అ) జనాభాలో సగంగా ఉన్న మహిళల ఉనికి ప్రమాదంలో పడింది. భ్రూణ హత్యలు, ప్రత్యూషలు, రిషితేశ్వరిలు, ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అవమానాలను ఎదుర్కొంటున్న స్మితా సభర్వాల్ లాంటి వారు, అంతర్జాలంలో బూతు చిత్రాల (నిలిపివేత తాత్జ్కాలికమేనని ప్రభుత్వం ఈ ఉదయమే సెలవిచ్చింది), సమస్యకు కూడా జయశంకరుని మార్గంలోనే పరిష్కారం లభిస్తుంది.
ఇ) సీమాంధ్ర పజానీకం పట్ల మాకు (తెలంగాణా ప్రజలకు) ఎల్లవేళలా సానుభూతి ఉంటుంది. వారి సమస్యలు పరిష్కారం కొరకు కూడా ఆచార్య జయశంకర్ చూపిన దోవలోనే సాధ్యమౌతుంది. స్వర్ణాంధ్ర సాకారమౌతుంది.
జై సీమాంధ్ర- జై తెలంగాణా
ప్రజాస్వామ్య వ్యవస్థలో పీడితులకు అందుబాటులోనున్న ఏకైక మార్గం అహింసాయుత పోరాటం. ఈ పోరాటం త్రిముఖంగా సాగాలి. 1) భావవ్యాప్తి 2) శాంతియుత ఉద్యమం 3) రాజకీయ ప్రక్రియ. ఈ ఎత్తుగడలద్వారానే తెలంగాణా రాష్ట్రం సాకారమైంది.
సామాజిక సమస్యల పరిష్కారానికి ఇదొక్కటే మార్గం. ప్రస్తుత కాలంలో కనిపించే రెండు తీవ్ర సమస్యలు:
అ) జనాభాలో సగంగా ఉన్న మహిళల ఉనికి ప్రమాదంలో పడింది. భ్రూణ హత్యలు, ప్రత్యూషలు, రిషితేశ్వరిలు, ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ అవమానాలను ఎదుర్కొంటున్న స్మితా సభర్వాల్ లాంటి వారు, అంతర్జాలంలో బూతు చిత్రాల (నిలిపివేత తాత్జ్కాలికమేనని ప్రభుత్వం ఈ ఉదయమే సెలవిచ్చింది), సమస్యకు కూడా జయశంకరుని మార్గంలోనే పరిష్కారం లభిస్తుంది.
ఇ) సీమాంధ్ర పజానీకం పట్ల మాకు (తెలంగాణా ప్రజలకు) ఎల్లవేళలా సానుభూతి ఉంటుంది. వారి సమస్యలు పరిష్కారం కొరకు కూడా ఆచార్య జయశంకర్ చూపిన దోవలోనే సాధ్యమౌతుంది. స్వర్ణాంధ్ర సాకారమౌతుంది.
జై సీమాంధ్ర- జై తెలంగాణా
ఆచార్య జయశంకర్ - అమర్ హై
- రావిచెట్టు రాజేశ్వర్ రావు
--((***))--
- రావిచెట్టు రాజేశ్వర్ రావు
--((***))--